Source: 
Telugu.samayam
https://telugu.samayam.com/latest-news/india-news/national-parties-collected-rs-15077-crore-from-unknown-sources-between-2004-to-2021-adr-survey/articleshow/93806554.cms
Author: 
Sreenu Gangam
Date: 
26.08.2022
City: 

Donations for National Parties from unknown Sources: రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి ADR సర్వే సంచలన వివరాలు వెల్లడించింది. ఆ విరాళాల్లో ఎక్కువగా మూలాలు లేకుండా ఉన్నవే కావడం మరొక ముఖ్యమైన అంశం. ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ బయటపెట్టింది. 2004-05 నుంచి 2020-21 మధ్య కాలంలో జాతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలో రూ.15,077 కోట్లు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుంది.

ప్రధానాంశాలు:

  • పార్టీలకు భారీగా గుప్త నిధులు.
  • 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలపై ADR సర్వే.
  • అగ్రస్థానంలో ఉన్న పార్టీలు ఏవి? ఎన్ని కొట్ల నిధులు వచ్చాయి?

రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి ఓ సర్వే వెల్లడించిన నివేదికలోని వివరాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఆ విరాళాల్లో ఎక్కువగా రహస్యంగా వస్తున్నవే ఉండటం మరొక ప్రధానమైన అంశం. ఎన్నికల విరాళాలకు సంబంధించి సంచలన నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ (ADR) బయటపెట్టింది. 2004 - 05 నుంచి 2020 - 21 మధ్య కాలంలో జాతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలో రూ.15,077 కోట్లు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఒక్క 2020 - 21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ.690.67 కోట్లు విరాళంగా అందినట్లు తెలిపింది. ఇవన్నీ మూలాలు తెలియకుండా వచ్చిన విరాళాలే.

దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని ఏడీఆర్ ఈ సర్వే నిర్వహించింది. 2004 - 05 నుంచి 2020 - 21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు, డొనేషన్‌కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.

ఈ సర్వే నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8 జాతీయ పార్టీలకు గుర్తు తెలియని మూలాల నుంచి రూ.426.74 కోట్లు విరాళాలుగా వచ్చాయి. 27 ప్రాంతీయ పార్టీలకు రూ.263.92 కోట్లు విరాళాలుగా వచ్చాయి.

2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను కాంగ్రెస్ పార్టీకి 178.782 కోట్లు గుప్త మూలాల నుంచి విరాళాలు వచ్చాయి. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో కాంగ్రెస్ పార్టీ వాటా 41.89 శాతం కావడం గమనార్హం. ఇదే కాలానికి బీజేపీ పార్టీకి గుర్తు తెలియని మూలాల నుంచి రూ.100.502 కోట్లు విరాళంగా వచ్చాయి. జాతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో ఈ వాటా 23.55 శాతం.

ప్రాంతీయ పార్టీల్లో 5 పార్టీలకు అత్యధికంగా గుప్త విరాళాలు వచ్చాయి. ఈ జాబితాలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రూ.96.2507 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే (రూ.80.02 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఎంఎన్‌ఎస్‌ (రూ.5.773 కోట్లు), ఆమ్ ఆద్మీ పార్టీ (రూ.5.4 కోట్లు) ఉన్నాయి.

జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.690.67 కోట్ల విరాళాల్లో 47.06% ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి వచ్చాయని ఏడీఆర్‌ సర్వే వెల్లడించింది. ఏడీఆర్ సర్వేకు పరిగణనలోకి తీసుకున్న 8 జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఉన్నాయి.

ఇక 27 ప్రాంతీయ పార్టీల్లో.. టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ‌తో పాటు.. ఆప్‌, ఏజీపీ, ఏఐఐఏడీఎంకే, ఏఐఎఫ్‌బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్‌, బీజేడీ, సీపీఐ (ఎంఎల్‌) (ఎల్‌), డీఎండీకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్‌, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్‌ఎస్‌, ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్‌, పీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఎస్‌ఏడీ, ఎస్‌డీఎఫ్‌, శివసేన, ఎస్‌కేఎం ఉన్నాయి.


© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method