Source: 
TV9telugu
https://tv9telugu.com/politics/bjp-has-highest-assets-among-top-7-national-parties-says-adr-analysis-624676.html
Author: 
Shiva Prajapati
Date: 
28.01.2022
City: 

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. అధికార పరంగానే కాదు.. ఆర్థికంగానూ బలమైన శక్తిగా ఎదుగుతోంది. జాతీయ పార్టీ అయిన అధికార బీజేపీకి నిధులు భారీగా ఉన్నాయి. ఫండ్స్‌తో పాటు, స్థిరాస్తుల విలువలు పెరుగుతున్నాయి. దాంతో బీజేపీ దేశంలోని మరే పార్టీ కూడా బీట్ చేయలేని స్టేజ్‌లో ఉంది. రూ. 4,847.78 కోట్ల స్థిర చరాస్తులతో దేశంలోనే టాప్‌లో నిలిచింది బీజేపీ.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) అధ్యయనం ప్రకారం.. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ, 44 ప్రాంతీయ పార్టీలు తమ పార్టీల నిధులు, ఆస్తుల వివరాలను ప్రకటించారు. జాతీయ పార్టీల ఆస్తులు/నిధులు మొత్తం కలిపి రూ. 6,988.57 కోట్లు కాగా, ప్రాంతీయ పార్టీల ఆస్తుల విలువ మొత్తం రూ. 2,129.38 కోట్లు. వీటిలో అత్యధిక ఆస్తులు కలిగిన జాతీయ పార్టీగా రూ. 4,847.78 కోట్లతో(69.37 శాతం) భారతీయ జనతా పార్టీ (బిజెపి) టాప్‌లో నిలిచింది. బీజేపీ తరువాత రూ. 698.33 కోట్లు (9.99 శాతం) బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత రూ. 588.16 కోట్ల (8.42 శాతం) విలువైన ఆస్తులను ప్రకటించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) మూడో స్థానంలో నిలిచింది.

ఇక 44 ప్రాంతీయ రాజకీయ పార్టీలలో, టాప్ 10 పార్టీలు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 2,028.715 కోట్లు. వీటిలో అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రూ. 563.47 కోట్లు (26.46 శాతం)తో టాప్‌లో నిలిచింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) రూ. 301.47 కోట్లు, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ్ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) రూ. 267.61 కోట్లుగా ప్రకటించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు/ఎఫ్‌డిఆర్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులలో రూ. 1,639.51 కోట్లు అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయని విశ్లేషణలో వెల్లడైంది.

కాగా, ‘‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మార్గదర్శకాలను పాటించడంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయని, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీల నుండి తీసుకున్న రుణాల వివరాలను ప్రకటించాలనే నియమాన్ని పార్టీలు విస్మరించాయి.’’ అని ఏడీఆర్ విశ్లేషణలో తేల్చింది.

పార్టీలు విరాళంగా స్వీకరించిన స్థిర ఆస్తుల వివరాలు అంటే ఆస్తి అసలు ధర, ఏవైనా చేర్పులు లేదా తగ్గింపులు, నిర్మాణ వ్యయం మొదలైనవి ప్రకటించాలి. కానీ, ఏ పార్టీ కూడా ఈ సమాచారాన్ని ప్రకటించలేదని విశ్లేషణ పేర్కొంది. అలాగే, నగదు/వస్తువుగా ఇచ్చిన రుణాల వివరాలను కూడా ఏ పార్టీ ప్రకటించలేదు.

రాజకీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు ఆరు ప్రధాన అంశాల క్రిందకు వస్తాయి. అవి స్థిర ఆస్తులు, రుణాలు, అడ్వాన్సులు, FDR/ డిపాజిట్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు. ఇక జాతీయ పార్టీలలో బీజేపీ, బీఎస్‌పి వరుసగా FDR/ఫిక్స్‌డ్ డిపాజిట్ల క్రింద అత్యధిక ఆస్తులను రూ. 3,253.00 కోట్లు, రూ. 618.86 కోట్లుగా ప్రకటించగా, కాంగ్రెస్ రూ. 240.90 గా ప్రకటించింది.

ప్రాంతీయ పార్టీలలో అత్యధిక ఆస్తులను ఎఫ్‌డిఆర్/ఫిక్స్‌డ్ డిపాజిట్ల కింద ఎస్‌పి రూ. 434.219 కోట్లు, టిఆర్‌ఎస్ రూ. 256.01 కోట్లు, ఎఐఎడిఎంకె రూ. 246.90 కోట్లు, డిఎంకె రూ. 162.425 కోట్లు, శివసేన రూ. 148.46 కోట్లు, బిజూ జనతా దళ్ రూ. 118.425 కోట్లు ప్రకటించాయి.

అప్పుల విషయానికి వస్తే.. ఏడు జాతీయ, 44 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం అప్పులు రూ.134.93 కోట్లు. జాతీయ రాజకీయ పార్టీలు మొత్తం అప్పులు రూ.74.27 కోట్లు, రుణాల కింద రూ.4.26 కోట్లు, ఇతర అప్పుల కింద రూ.70.01 కోట్లుగా ప్రకటించాయి.

వీటిలో కాంగ్రెస్ అత్యధికంగా రూ . 49.55 కోట్లు (66.72 శాతం) రుణాలను ప్రకటించగా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) రూ. 11.32 కోట్లు (15.24 శాతం) ప్రకటించింది. ప్రాంతీయ రాజకీయ పార్టీలు మొత్తం అప్పులు రూ.60.66 కోట్లు, రుణాల కింద రూ.30.29 కోట్లు, ఇతర అప్పుల కింద రూ.30.37 కోట్లు ప్రకటించాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అత్యధికంగా రూ. 30.342 కోట్లు (50.02 శాతం) ప్రకటించగా, డీఎంకే రూ. 8.05 కోట్లు (13.27 శాతం) ప్రకటించింది.

రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన రాజకీయ పార్టీల ఆడిటింగ్‌పై ICAI మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే, వీటిని ఏ రాజకీయ పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోలేదని ఏడీఆర్ విశ్లేషణ తేల్చింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method