Skip to main content
Source
Indiaglitz
https://www.indiaglitz.com/ys-jagan-mohan-reddy-richest-cm-in-india-mamata-banerjee-poorest-news-335535
Date

దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రుల్లో .. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగుచూసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూలు తెలిపాయి.

30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే :

30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని తేలింది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే నిరుపేద ముఖ్యమంత్రిగా ఏడీఆర్ తెలిపింది. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలేనని చెప్పింది. నివేదిక ప్రకారం ఏపీ సీఎం జగన్ ఆస్తుల విలువ రూ.510 కోట్లు. ఆ తర్వాత రూ.163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో నిలిచారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (63 కోట్లు) మూడో స్థానంలో వున్నారు.

13 మంది సీఎంలపై తీవ్రమైన నేరాలు :

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ల ఆస్తులు రూ.3 కోట్లపైనేనని నివేదిక తెలిపింది. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైల ఆస్తులు రూ. 8 కోట్లని వెల్లడించింది. ఈ లిస్ట్‌లో కేరళ సీఎం పినరయి విజయన్, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ల ఆస్తి కోటిపైనే వుంటుందని తెలిపింది. జాబితాలో మమతా బెనర్జీతో కలిసి వీరిద్దరూ చివరిలో నిలిచారు. అంతేకాదు.. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన నేరాలు, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు వున్నాయని వారే అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీటిలో ఏ ఒక్క దానికి కూడా బెయిల్ రాదని.. ఐదేళ్లకుపైనే శిక్ష పడుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.


abc